దుమ్కా: జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్కా జిల్లాలో ఘోరం జరిగింది. పెండ్లికి ఒప్పుకోలేదన్న కారణంతో ఓ వివాహితుడు 19 ఏండ్ల యువతిపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. బాధితురాలి ఇంటి వెళ్లి మరీ ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిద్రపోతున్న యువతికి నిప్పుపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వారు మెరుగైన చికిత్స కోసం జార్ఖండ్ రాజధాని రాంచికి రిఫర్ చేశారు.
బాధితురాలిని పరీక్షించిన వైద్యులు ఆమెకు 90 శాతం కాలిన గాయాలైనట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె మృత్యువుతో పోరాటం చేస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలి గ్రామానికే చెందిన రాజేశ్ రౌత్కు ఇప్పటికే పెండ్లయ్యింది. అయినా గ్రామంలోని 19 ఏండ్ల యువతిపై అతని కన్ను పడింది. తనను పెండ్లి చేసుకోవాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.
అందుకు బాధితురాలు నిరాకరించినా విడిచిపెట్టలేదు. మళ్లీమళ్లీ ఒత్తిడి తీసుకొచ్చాడు. దాంతో ఆమె తన కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. వాళ్లు కూడా రాజేశ్కు చీవాట్లు పెట్టి, మరోసారి మా పిల్ల జోలికి రావద్దని హెచ్చరించారు. దాంతో యువతిపై కోపం పెంచుకున్న రాజేశ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.