జమ్ము: ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగిన సీనియర్ రాజకీయ నాయకుడు గులాం నబీ ఆజాద్ త్వరలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 4న ఆ బహిరంగ సభ జరుగనుంది. ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఆయన నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇది. జమ్ములోని సైనిక్ కాలనీలో ఈ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కాసేపటికే ఆజాద్.. తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటన చేశారు. ముందుగా జమ్ముకశ్మీర్ యూనిట్ను ఏర్పాటు చేసి, ఆ తర్వాత జాతీయ స్థాయి పార్టీగా మార్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. పక్షం రోజుల్లో తాము పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆజాద్ సన్నిహిత నాయకుడు సరూరీ కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4 నాటి బహిరంగసభలో.. ఆజాద్ తాను పెట్టబోయే కొత్త పార్టీ పేరును ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్నది.
గులాం నబీ ఆజాద్ గత వారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన 5 పేజీల రాజీనామా లేఖలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీపైన, ఆయన కోటరీపైన తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. సొంత పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు తన అనుచర నేతలతో కలిసి తీవ్ర కసరత్తు చేస్తున్నారు.