న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నలు మూలల నుంచి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లకు డిమాండ్ పెరిగిందని రైల్వే చైర్మన్ సునీత్ శర్మ తెలిపారు. అన్ని ప్రాంతాలకు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ 19న వైజాగ్, ముంబై మధ్య తొలి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ డ్రై రన్ తరువాత, 25 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడిచాయని, 56 ట్యాంకర్లలో 813 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను రవాణా చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు 25 ఆక్సిజన్ ట్యాంకర్లను ఉత్తరప్రదేశ్కు, 10 ట్యాంకర్లను మహారాష్ట్రకు, 12 ట్యాంకర్లను మధ్యప్రదేశ్కు, ఐదు ట్యాంకర్లను హర్యానాకు, నాలుగు ట్యాంకర్లను ఢిల్లీకి చేరవేసినట్లు వెల్లడించారు. మరి కొన్ని ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నామని, మరికొన్నింటికి కూడా నడుపుతామన్నారు.
కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆక్సిజన్ రవాణాతోపాటు ఐసొలేషన్ బోగీల ఏర్పాటులోనూ రైల్వే ఎంతో సహకరిస్తున్నదని సునీత్ శర్మ తెలిపారు. ఇప్పటి వరకు 64,000 బెడ్స్తో కూడిన 4,000 ఐసొలేషన్ కోచ్లను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 1,390 ప్రత్యేక రైళ్లు, 5,387 సబ్ అర్బన్ రైళ్లు ప్రతి రోజు నడుస్తున్నాయని అన్నారు. 794 పాసింజర్ రైళ్లను కూడా నడుపుతున్నామని, మొత్తం మీద 70 శాతం రైళ్లను పునరిద్ధరించినట్లు వివరించారు. బాగా డిమాండ్ ఉన్న ప్రాంతాలకు అదనంగా 370 రైళ్లు నడిపినట్లు వెల్లడించారు.