‘మీకు మూడింది. అంత్యక్రియలకు సిద్ధంగా ఉండండి’… అంటూ కర్నాటక మాజీ ముఖ్యమంత్రులతో సహా 64 మంది వ్యక్తులకు గుర్తు తెలియని వ్యక్తులు పంపిన సందేశమిది. విపక్ష నేత, మాజీ సీఎం సిద్దరామయ్య, జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమార స్వామి, రచయిత వీరభద్రప్పతో సహా 64 మందికి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు లేఖలు పంపారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
అయితే తాము మితవాద హిందువులమేనని ఈ లేఖలో వారు స్పష్టంగా పేర్కొన్నారు. ‘మరణం మీకు అతి దగ్గరలో వుంది. వినాశనం అన్న మార్గంలోనే ఉన్నారు. మృత్యువుకు దగ్గరగా వున్నారు. మీ అంత్యక్రియలకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకోండి. ఈ విషయాన్ని మీ కుటుంబీకులు తెలియజేండి’ అంటూ ఆ లేఖలో వుంది.
అయితే ఈ బెదిరింపులపై మాజీ సీఎం కుమార స్వామి స్పందించారు. ఈ బెదిరింపులను ప్రభుత్వం ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా.. విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వం మౌనంగా ఉండడం ఏమాత్రం బాగోలేదని ఇతరులు మండిపడుతున్నారు.