గౌహతి, మార్చి 18: పరీక్ష పేపర్ల లీకేజీలతో అస్సాం అట్టుడుకుతున్నది. కొద్ది రోజుల క్రితం పదో తరగతి పరీక్షకు చెందిన రెండు పేపర్లు లీక్ కావడం సంచలనం సృష్టించింది. తాజాగా శనివారం సైతం మరో పేపర్ లీకైందంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే దీన్ని ప్రభుత్వం ఖండిస్తూ అలాంటి వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న ఇద్దరు టీచర్లను ఆదివారం లఖింపూర్ నుంచి గౌహతికి తీసుకు రానున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, టీచర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.