న్యూఢిల్లీ, జనవరి 14: త్రివిధ దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్తో పాటు పలువురి మృతికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదం పైలట్ తప్పిదం వల్లనే జరిగిందని దర్యాప్తు బృందం ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ‘లోయలో హఠాత్తుగా వాతావరణం మారడంతో హెలికాప్టర్ మబ్బుల్లోకి వెళ్లింది. దీనివల్ల ఎత్తుకు సంబంధించిన గందరగోళం తలెత్తింది. ఫలితంగా హెలికాప్టర్ నేరుగా వెళ్లి నేలను ఢీకొట్టింది’ అని దర్యాప్తు బృందం ఫ్లయిట్ డాటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ పరిశీలన, అందుబాటులో ఉన్న సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిర్ధారించింది. ఈ ప్రమాదాన్ని సాంకేతిక పరిభాషలో కంట్రోల్డ్ ఫ్లయిట్ ఇంటూ టెర్రేయిన్ (సీఎఫ్ఐటీ)గా అభివర్ణిస్తారు. అంటే సాంకేతికంగా అన్నిరకాలుగా సజావుగా ఉండి, పైలట్ నియంత్రణలోనే ఉన్న ఎగిరే వాహనం ఎత్తు తదితర అంశాలకు సంబంధించిన గందరగోళం వల్ల భూమిని, కొండను లేదా మరే ఇతర అడ్డంకిని ఢీకొనడమో లేక నీటిలో పడిపోవడమో జరుగుతుంది. వాహనంపై నియంత్రణ కోల్పోకుండానే ప్రమాదానికి గురికావడమని దీని సారాంశం. గతనెల 8న జరిగిన ఎంఐ17-వీఐ హెలికాప్టర్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక, మరో 12 మంది సైనికదళాల అధికారులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని సూలూర్ విమాన స్థావరం సమీపంలో ప్రమాదానికి గురైంది. అందులో గ్రూప్ కెప్టెన్ వరుణ్సింగ్ తప్ప అందరూ అక్కడికక్కడే మరణించారు. వరుణ్సింగ్ కొద్ది రోజుల తర్వాత చికిత్స పొందుతూ మరణించారు.