మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ పతనమవుతున్నది. 2028నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దుతామంటూ ఊదరగొడుతున్న ప్రకటనలన్నీ ఉత్తవేనని తేటతెల్లమైంది. డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో ప్రపంచ ఎకానమీల్లో భారత్ స్థానం దిగజారుతూ వస్తున్నది. 2025లో దేశ జీడీపీ ర్యాంక్ ఐదోస్థానం నుంచి 6వ స్థానానికి పతనమైనట్టు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తాజా గణాంకాల్లో తేలడం ఆందోళన కలిగిస్తున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 21 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): తమ పాలనలో దేశ ఆర్థికం పరుగులు పెడుతున్నదన్న బీజేపీ నాయకుల మాటలు అబద్ధాలేనని మరోసారి రుజువైంది. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన భారత్.. అతిపెద్ద ఎకానమీల్లో టాప్-5 జాబితాలోనూ లేకుండా పోయింది. 2025కి గానూ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తాజాగా విడుదల చేసిన జీడీపీ ర్యాంకుల్లో భారత ర్యాంకు ఐదు నుంచి 6వ స్థానానికి పడిపోయింది. దీంతో 2028కల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనున్నదని మోదీ సహా బీజేపీపరీవారమంతా చేస్తున్న ప్రచారం ఉత్తదేనని తేటతెల్లమైంది.
మోదీ పాలనలో ఆర్థికప్రగతి గాడితప్పడం, రూపాయికి కష్టాలు దాపురించడమే దీనికి ప్రధాన కారణమని ఆర్థికరంగ విశ్లేషకులు చెబుతున్నారు. 2024లో భారత్ జీడీపీ విలువ 3.5 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇదే సమయంలో బ్రిటన్ది 3.4 ట్రిలియన్ డాలర్లుగా రికార్డయ్యింది. దీంతో ఆ ఏడాది ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారగా, బ్రిటన్ ఆరో స్థానానికి పరిమితమయ్యింది. అయితే, ఏడాది వ్యవధిలోనే ఈ ర్యాంకులు రివర్స్ అయ్యాయి.
ఐఎంఎఫ్ తాజా అంచనాల ప్రకారం.. 2025లో దేశ ఆర్థిక వ్యవస్థ విలువ 3.92 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇదే సమయంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ విలువ 4 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకింది. దీంతో గతంలో భారత్ కంటే ఒక ర్యాంకు వెనుకంజలో ఉన్న బ్రిటన్.. ఇండియాను తోసిరాజని ఐదో స్థానానికి దూసుకెళ్లింది. 5వ ర్యాంకులో ఉండాల్సిన భారత్ 6వ స్థానానికి పరిమితమైంది. కాగా, 2024లో జీడీపీ ర్యాంకింగ్లో భారత్ 5వ స్థానానికి రాగానే, అదంతా తమ ఘనతేనని ప్రచారం చేసుకొన్న మోదీ పరీవారం.. ఇప్పుడు మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం.
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతున్నది. మోదీ పాలనలో చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో రూపాయి విలువ పతనమయ్యింది. 12 ఏండ్ల బీజేపీ పాలనలో డాలర్తో రూపాయి మారకం విలువ ఏకంగా రూ. 36.19 మేర (61.69 శాతం) క్షీణించింది. రూపాయి పతనం.. దేశీయ దిగుమతుల్ని భారం చేయడం మాత్రమేగాక, దేశ ఆర్థిక వ్యవస్థనూ కుప్పకూల్చగలదు. ఐఎంఎఫ్ తాజా జీడీపీ ర్యాంకింగ్స్లోనూ భారత్కు ముప్పు తెచ్చింది కూడా ఈ రూపాయే. 2024 ఆఖర్లో డాలర్తో చూస్తే రూపాయి మారకం విలువ రూ.85.64గా ఉన్నది.
2025 చివర్లో ఇది రూ.89.88కి క్షీణించింది. అంటే 2025లో ఏడాది వ్యవధిలో రూపీ ఎక్సేంజ్ వాల్యూ ఏకంగా రూ.4.24 మేర తగ్గింది. గత మార్చి 27న రూపాయి మారకం విలువ తొలిసారి 94.85 వద్దకు దిగజారింది. ఒకానొక దశలోనైతే ఏకంగా 95 మార్కును తాకింది. దీంతో రూపాయి పతనం ఇలా కొనసాగుతుండటంతో ఈ ఏడాది దేశ జీడీపీ ర్యాంక్ ఇంకా తగ్గిపోతుందేమోనన్న భయాలు కనిపిస్తున్నాయి. రూపాయి పతనం కారణంగా ఈ ఏడాదిలోనూ ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 6వ స్థానానికే పరిమితం కావచ్చని ఐఎంఎఫ్ అంచనా వేస్తున్నది.

