న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: త్వరలో లోక్సభతోపాటు ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల ధరలను కేంద్రం తగ్గిస్తున్నది. ఇప్పటికే వంటగ్యాస్ ధరను రూ.200 తగ్గించగా.. తాజాగా కమర్షియల్ సిలిండర్ ధరను రూ.157.50 తగ్గించింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,522.50కి చేరుకుంది. ప్రజా వ్యతిరేకత ఎన్నికలపై పడకుండా ఉండటానికే కేంద్రం వరుసగా ధరలను తగ్గిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు విమానాల్లో వినియోగించే ఇంధనం ధరను కేంద్రం పెంచింది. ఒక్క కిలోలీటరుకు రూ.13,911 పెంచుతున్నట్టు ప్రకటించింది.