చండీగఢ్: పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక నిందితుడు, గ్యాంగ్స్టర్ దీపక్ టిను ఇటీవల తప్పించుకున్నాడు. అయితే అతడ్ని తిరిగి అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. పంజాబ్లోని మాన్సా జిల్లాలో సిద్ధూ మూసేవాలాగా పేరుగాంచిన సింగర్ శుభదీప్ సింగ్ సిద్ధూను ఈ ఏడాది మే 29న హత్య చేశారు. స్నేహితుడు, బంధువుతో కలిసి జీపులో మాన్సాలోని జవహర్ కే గ్రామానికి సిద్ధూ వెళ్తుండగా ఆరుగురు షూటర్లు అతడిపై కాల్పులు జరిపారు. లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు గోల్డీ బ్రార్ ఈ హత్యకు బాధ్యత వహించాడు. కలకలం రేపిన సిద్ధూ హత్య కేసు ఛార్జ్పీట్లో పేర్కొన్న 24 మంది నిందితుల్లో దీపక్ అలియాస్ టిను ఒకడు.
కాగా, ఈ నెల 1వ తేదీ మధ్య రాత్రి వేళ పోలీస్ కస్టడీ నుంచి దీపక్ టిను తప్పించుకున్నాడు. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ) సిబ్బంది మరో కేసులో దర్యాప్తు కోసం వారెంట్పై కపుర్తలా జైలు నుంచి మాన్సాకు తరలిస్తుండగా పోలీసుల కళ్లగప్పి పారిపోయాడు. దీంతో అతడ్ని పట్టుకునేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న 17 రోజుల తర్వాత దీపక్ను తిరిగి అరెస్ట్ చేశారు. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో మరో కీలక నిందితుడైన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కి దీపక్ టిను సన్నిహితుడు.