న్యూఢిల్లీ: గంగా ఎక్స్ప్రెస్ వే పూర్తయితే పరిసర ప్రాంతాల ప్రజలకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఇవాళ షాజహాన్పూర్లో గంగా ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి ప్రధాని చేతులమీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ.. సుమారు 600 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి రూ.36 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు.
గంగా ఎక్స్ప్రెస్ వేకు శంకుస్థాపన జరుగడంతో ఆ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలైన మీరట్, హాపూర్, బులంద్షహర్, అమ్రోహ, సంభాల్, బదౌన్, షాజహాన్పూర్, హర్దోయ్, ఉన్నవ్, రాయ్బరేలీ, ప్రతాప్గఢ్, ప్రయాగ్రాజ్ ప్రజలకు ప్రధాని అభినందనలు తెలియజేశారు. గంగా ఎక్స్ప్రెస్ వే పూర్తయితే పలు కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతాయని ఆయన చెప్పారు. దాంతో స్థానిక యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
భవిష్యత్ తరం మౌలిక సదుపాయాలతో ఉత్తరప్రదేశ్ అత్యాధునిక రాష్ట్రంగా గుర్తింపు పొందడానికి ఇంకా ఎంతో కాలం పట్టదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. యూపీలోని ఎక్స్ప్రెస్ వేస్ నెట్వర్క్తో కొత్త ఎయిర్పోర్టులు, కొత్త రైలు మార్గాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రజాధనం గతంలో ఎలా దుర్వినియోగమయ్యేదో అందరూ చూశారని, పాలకులు భారీ ప్రాజెక్టులను పేపర్లకు పరిమితం చేసి సొంత ఖజానా నింపుకునే వారని ఆరోపించారు.