జైపూర్: రాజస్థాన్లో దారుణం చోటుచేసుకున్నది. రెండు రౌడీ గ్రూప్ల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. అయితే ఇందులో ఓ సాధారణ వ్యక్తి తుపాకీ కాల్పులకు బలయ్యాడు. సికర్ జిల్లాలోని పిప్రాలిలో గ్యాంగ్ స్టర్ రవి బిష్ణోయి గ్రూప్నకు చెందిన రోహిత్ గొదార వర్గం.. మరో గ్యాంగ్ స్టర్ రాజు ఠేహట్ ఇంటిపై దాడిచేశారు. స్థానిక కోచింగ్ సంస్థ యూనీఫామ్లో వచ్చిన నలుగురు వ్యక్తులు.. రాజును తన ఇంటి బయటే కాల్చి చంపారు.
అయితే అదేసమయంలో తారాచంద్ కద్వసారా అనే వ్యక్తి తన 16 ఏండ్ల కూతురిని కోచింగ్కు తీసుకెళ్తున్నాడు. గ్యాంగ్ స్టర్ల కాల్పుల్లో తారాచంద్ ఒంట్లోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు మృతిచెందాడు. దీంతో కళ్ల ముందే తన తండ్రి చనిపోవడంతో ఆ బాలిక కన్నీరు మున్నీరయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.