లక్నో: ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన దుండగులు అతడి పెంపుడు కుక్కను డిమాండ్ చేశారు. ఆ కుక్కను తమకు ఇవ్వకపోతే కిడ్నాప్ చేసిన వ్యక్తిని చంపుతామంటూ అతడి కుటుంబాన్ని ఫోన్లో బెదిరించారు. వినడానికి వింతగా ఉన్న ఈ సంఘటన ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జరిగింది. రాహుల్ ప్రతాప్ అనే వ్యక్తి గ్రేటర్ నోయిడా ఆల్ఫా2 ప్రాంతంలోని యునిటెక్ హారిజన్ సొసైటీలో నివసిస్తున్నాడు. బుధవారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు అక్కడకు వచ్చారు. రాహుల్ వద్ద ఉన్న పెంపుడు కుక్క అర్జెంటీనోను వారు చూశారు. ఆ కుక్కను తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాహుల్ నిరాకరించడంతో బలవంతంగా తమ స్కార్పియోలోకి ఎక్కించారు. అతడ్ని కిడ్నాప్ చేసి అలీగఢ్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత రాహుల్ మొబైల్ నుంచి అతడి కుటుంబానికి ఫోన్ చేశారు. వారి పెంపుడు కుక్కను తమకు ఇవ్వకపోతే రాహుల్ను చంపుతామని బెదిరించారు.
కాగా, రాహుల్ కిడ్నాప్పై ఆందోళన చెందిన సోదరుడు శుభం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ విషయం తెలిసిన కిడ్నాపర్లు అలీగఢ్ సమీపంలోని రోడ్డు వద్ద రాహుల్ను వదిలేశారు. ఎలాగోలా నోయిడా చేరుకున్న అతడు పోలీసులను కలిశాడు. తన కిడ్నాప్ గురించి వారికి వివరించాడు.
మరోవైపు రాహుల్ కిడ్నాప్ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతడ్ని కిడ్నాప్ చేసిన ముగ్గురిని అలీగఢ్కు చెందిన విశాల్ కుమార్, లలిత్, మాంటీగా గుర్తించినట్లు చెప్పారు. త్వరలో వారిని అరెస్ట్ చేస్తామని, రాహుల్ను ఎందుకు కిడ్నాప్ చేశారో అన్నది తెలుసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు.