జైపూర్: రాజస్థాన్లో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ కరోనా కేసు నమోదైంది. గత మే నెలలో కరోనా నుంచి కోలుకున్న ఓ 65 ఏండ్ల మహిళ ఆ తర్వాత రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్లు కూడా వేయించుకున్నది. తాజాగా అమె మరోసారి పరీక్షలు చేయించుకోగా డెల్టా ప్లస్ వేరియంట్ కరోనా వైరస్ బయటపడింది. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యంగానే ఉన్నదని రాజస్థాన్ ప్రభుత్వ అధికారులు తెలిపారు.
తాజా కేసుతో దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ వెలుచూసిన రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్ కూడా చేరింది. సదరు మహిళ శాంపిల్స్ను మే 31 ఒకసారి, ఆ తర్వాత 25 రోజులకు ఒకసారి పరీక్షల నిమిత్తం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు బికనీర్లోని పీబీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆమెలో డెల్టా ప్లస్ వేరియంట్ ఉన్నట్లు తేలడంతో ఈ కేసును ఆ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది.
సదరు మహిళ ఇరుగు పొరుగు వారిలో ఆమెతో కాంటాక్ట్ అయిన వారు అందరినీ ట్రేస్ చేయాలని బికనీర్ సీఎంహెచ్వో ఓపీ చాహర్ స్థానిక ఆరోగ్య సిబ్బందికి సూచించారు. గత నెల రోజుల వ్యవధిలో ఆ ఏరియాలో కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న అందరికీ మరోసారి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. స్థానికంగా వెలుగుచూసిన కేసులు రాష్ట్రమంతటా వ్యాపించకుండా అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆదేశించారు.