TN Assembly : తమిళనాడు శాసనసభ (Tamil Nadu Assembly) మంగళవారం నాటి సమావేశాల్లో తీవ్ర వాదోపవాదాలు, నాటకీయ పరిణామాల మధ్య అట్టుడికింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay), ప్రతిపక్ష డీఎంకే (DMK) మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. చివరికి సీఎం ప్రసంగానికి నిరసనగా డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత సీఎం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ స్టాలిన్ మ్యానరిజం (Stalin Manarism) ను అనుకరించారు. దాంతో అధికార పార్టీ సభ్యుల చప్పట్లతో సభ హోరెత్తింది.
ముందుగా శాసనసభలో ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ.. డీఎంకే అక్రమంగా నిధులు సేకరిస్తోందని ఆరోపించడంతోపాటు, అవినీతికి పాల్పడిన వారిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనల్లో వాస్తవం లేదని, అవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆయన విమర్శించారు. విజయ్ ప్రసంగానికి డీఎంకే సభ్యులు పదేపదే అడ్డుతగలడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ డీఎంకే సభ్యులు నినాదాలు చేస్తూ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
ఇదే సమయంలో విజయ్ తన ప్రసంగంలో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను అనుకరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో సీట్ల పంపకాల చర్చల సందర్భంగా ‘అంతా సెటిల్ అయిపోయింది’ అనేలా స్టాలిన్ ప్రదర్శించిన మ్యానరిజంను విజయ్ అసెంబ్లీలో అనుకరించి చూపించారు. దాంతో అధికార పక్ష సభ్యుల చప్పట్లతో సభ హోరెత్తింది. తమ ప్రభుత్వం సీపీఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకోవడాన్ని ఈ సందర్భంగా విజయ్ సమర్థించుకున్నారు. మహిళల భద్రతతోపాటు మాదకద్రవ్యాల నిర్మూలనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.