Rajnath Singh : అనారోగ్యానికి గురైతే వైద్యుడి వద్దకు వెళ్లకుండా ఇంటర్నెట్ (Internet), చాట్జీపీటీ (ChatGPT) లో లక్షణాలను వెతికి.. తమకు ఫలానా వ్యాధి ఉందని నిర్ధారించుకుంటున్నారని, ఇది మంచితీరు కాదని రక్షణశాఖ మంత్రి (Defence Minister) రాజ్నాథ్సింగ్ (Rajnath Singh) సూచించారు. అలా చూసుకునేవారి సంఖ్య దేశంలో రోజురోజుకీ పెరుగుతోందని తెలిపారు.
శనివారం నోయిడాలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం మంచి పరిణామమే. కానీ ఇంటర్నెట్లో కనిపించిన సమాచారంతోనే రోగ నిర్ధారణకు రావడం సరైంది కాదు. స్వల్పంగా ఛాతినొప్పి వచ్చినా ఆన్లైన్లో వెతికి తీవ్రమైన గుండె జబ్బు ఉందని కొందరు భయపడుతున్నారు. అదే నొప్పి.. ఆందోళన, కండరాల సమస్యలవల్ల కూడా రావచ్చు. కొందరు రోగులు వారికి ఉన్న లక్షణాలు చెప్పకుండా.. ఇంటర్నెట్లో చదివిన వ్యాధి పేరును వైద్యుడికి చెబుతున్నారు’ అని ఆయన అన్నారు.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన రోగులు.. స్థానిక భాషలోని పదాలతో లక్షణాలను చెప్పడం కూడా వైద్యులకు సవాలేనని రాజ్నాథ్ అన్నారు. ఛాతీలో ‘దుక్ దుక్ (dhuk dhuk)’ గా ఉందని ఓ గ్రామీణుడు వైద్యుడికి చెప్పిన ఉదాహరణను ఆయన వివరించారు. వైద్య విద్యలో ‘దుక్ దుక్’ అనే లక్షణం గురించి ఎక్కడా ఉండదని చమత్కరించారు. యంత్రాలు శరీరంలో ఏం జరుగుతుందో గుర్తించగలవు.. కానీ రోగి మనసులోని భయం, ఆందోళనను అర్థం చేసుకోవడం వైద్యులకే సాధ్యమని రాజ్నాథ్సింగ్ అన్నారు.