Goods Train | జమ్ము/చండీగఢ్: లోకో పైలట్లు లేకుండా ఓ గూడ్సు రైలు 70 కిలోమీటర్లు పరుగులు తీసింది. ఆదివారం ఉదయం 7.25-9.00 గంటల మధ్య జరిగిన ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. డ్రైవర్లు లేకుండా రైలు 70 కిలోమీటర్లు ప్రయాణించినా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 53 వేగన్లతో చిప్స్టోన్స్ను మోసుకుని జమ్ము నుంచి పంజాబ్ వైపు రైలు బయలుదేరింది. డ్రైవర్ చేంజ్ కోసం జమ్ములోని కథువా రైల్వే స్టేషన్లో రైలును నిలిపారు.
ఆ ప్రదేశం కొంత వాలుగా ఉండడంతో తర్వాత కాసేపటికే రైలు నెమ్మదిగా కదులుతూ ముందుకు దూసుకెళ్లింది. ఆ సమయంలో రైలులో లోకోపైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ఎవరూ లేరని అధికారులు తెలిపారు. నెమ్మదిగా కదిలిన రైలు ఆ తర్వాత వేగం పుంజుకుంది. చివరికి పంజాబ్లోని ఉంచి బస్సీ రైల్వే స్టేషన్లో ఆగింది. ఈ ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించినట్టు జమ్ము డివిజినల్ ట్రాఫిక్ మేనేజర్ ప్రతీక్ శ్రీవాస్తవ తెలిపారు.