Golden Hour | న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు గొప్ప ఉపశమనం కలగనుంది. బాధితులకు సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో గోల్డెన్ అవర్ పేరుతో కేంద్రం కొత్త పథకం తీసుకొస్తున్నది. దీని ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత ఉచిత చికిత్స అందించనున్నది. హర్యానా, చంఢీగఢ్లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది. అనంతరం దీనిని దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఇందుకోసం ఎంవీఏ చట్టం-2019కి సవరణలు చేయాలని కేంద్రం భావిస్తున్నది.
కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ పథకం కింద రూ.1.5 లక్షలు లేదా 7 రోజుల దవాఖానలో చికిత్సలో ఏది తక్కువ ఖర్చయితే దాన్ని ఉచితంగా దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు కల్పించాలని కేంద్రం యోచిస్తున్నది. ప్రమాదం జరిగిన మొదటి గంట సమయాన్ని గోల్డెన్ అవర్గా పిలుస్తారు. ఈ టైమ్ లోగా సరైన చికిత్స అందితే ప్రాణాలు దక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కోసం సాధారణ బీమా కంపెనీలు 0.5 శాతం థర్డ్ పార్టీ ప్రీమియం వితరణతో సుమారు రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయనున్నాయి.