చండీగఢ్: అమృత్సర్లోని స్వర్ణదేవాలయం (Golden Temple) నుంచి గుర్బానీ (Gurbani) ని అందరికీ ఉచితంగా ప్రసారం చేస్తామని, ఈ మేరకు సిక్కు గురుద్వారా చట్టం – 1925ను సవరిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి (Punjab CM) భగవంత్ సింగ్ మాన్ (Bhagwant Mann) ట్విటర్లో చేసిన ప్రకటన రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ల నుంచి సీఎం ప్రకటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. గుర్బానీ అనేది సిక్కుల పవిత్ర శ్లోకం. స్వర్ణదేవాలయంలో పఠించే ఈ శ్లోకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు భక్తిశ్రద్ధలతో ఆలకిస్తారు. ఈ శ్లోకం ప్రసార హక్కులు ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఛానల్ దగ్గర మాత్రమే ఉన్నాయి. ఈ ప్రసార హక్కులన ఒక ఛానల్కే పరిమితం చేయకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ఉచితంగా ప్రసారం చేయాలని పంజాబ్ సర్కారు నిర్ణయించింది.
ఈ మేరకు సీఎం భగవంత్ మాన్ ట్వీట్ చేశారు. ‘భవంతుడి ఆశీస్సులతో మేం చరిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నాం. భక్తుల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు సిక్కు గురుద్వారా చట్టానికి కొత్తగా ఒక క్లాజ్ చేరుస్తున్నాం. దీనిద్వారా స్వర్ణదేవాలయానికి చెందిన గుర్బానీ అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. దీనిపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటాం. అలాగే జూన్ 20న అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహిస్తాం’ అని ట్విటర్లో పేర్కొన్నారు.
ఈ ట్వీట్ రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. గుర్బానీ (Gurbani) ప్రసార హక్కులను శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) పీటీసీ నెట్వర్క్కు కట్టబెట్టింది. ఈ నెట్వర్క్ రాజకీయంగా శక్తిమంతమైన మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్సింగ్ బాదల్ కుటుంబానికి చెందినది. సీఎం నిర్ణయం ఇప్పుడు పీటీసీ నెట్వర్క్ గుత్తాధిపత్యాన్ని నియంత్రించేదిగా ఉన్నది.
దాంతో SGPC, బాదల్ కుటుంబం, శిరోమణి అకాలీదళ్ పార్టీ సీఎం భగవంత్ మాన్ ప్రకటనపై మండిపడుతున్నాయి. సీఎం వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగ విరుద్ధమని, మతపరమైన కార్యకలాపాల్లో ప్రత్యక్ష జోక్యమని విమర్శిస్తున్నాయి. మరోవైపు సిక్కు గురుద్వారా చట్టాన్ని పార్లమెంట్ చేసిందని, దానిలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేయలేదని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.