న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు అహేతుకమైన ఉచిత హామీలు ఇచ్చే రాజకీయ పార్టీల గుర్తును సీజ్ చేయాలని లేదా ఆయా పార్టీల రిజిస్ట్రేషన్ను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్పై సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది. పరిధి దాటి ఇచ్చే ఉచిత హామీలు తీవ్రమైన అంశమని, కొన్నిసార్లు ఈ ఉచిత హామీల బడ్జెట్ సాధారణ బడ్జెట్ను మించిపోతున్నదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ పిల్ను దాఖలు చేశారు. దీనిపై నాలుగు వారాల్లోగా స్పందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రంతో పాటు ఈసీని ఆదేశించింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇటువంటి ప్రజాకర్షక చర్యలను నిషేధించాలని, ఇందుకు ఈసీ తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్దారు కోరారు. ఈ అంశంపై చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్పందించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ‘ ఈ సందర్భంగా నేను ఒక చట్టపరమైన ప్రశ్న అడగదలచుకున్నాను. దీన్ని ఎలా నియంత్రించాలో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. విపరీతమైన ఉచిత హామీల అంశం తీవ్రమైనదే.’ అని పేర్కొన్నారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల ముంగిట ఈ పిల్ దాఖలు కావడం గమనార్హం.