ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు అనేవి రెండూ వేర్వేరు అంశాలు. వాటిని ఒకేగాటన కట్టలేం. అయితే ఇదే సమయంలో రెండింటి మధ్య సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉన్నది. ఖజానాపై పడే భారాన్ని ఒకవైపు పరిగణనలోకి తీసుకుంటూనే ప్రజాసంక్షేమానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఉచిత హామీలిచ్చే పార్టీల గుర్తింపును రద్దు చేయాలంటున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి (ఈసీ) అధికారాలు ఇవ్వాలంటున్నారు. అయితే, ఈ అంశంలో కోర్టులు జోక్యం చేసుకోవాలని నేను
అనుకోవడం లేదు. ఉచిత హామీలను సాకుగా చూపుతూ పార్టీల గుర్తింపును రద్దు చేయాలనటం అప్రజాస్వామికం అవుతుంది.
– చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు రెండూ వేరువేరని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పేదల సంక్షేమాన్ని, ఉచితాలను ఒకేగాటన కట్టరాదని, వాటిని వేర్వేరుగా చూడాల్సిన అవసరమున్నదని నొక్కి చెప్పింది. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ప్రకటించే రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయాలనడం అప్రజాస్వామికం అవుతుందని అభిప్రాయపడింది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ న్యాయవాది, బీజేపీ నేత అశ్వనీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారీ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారించింది.
ఏమిటీ కేసు?
ఎన్నికల సమయంలో ఉచిత హామీలిచ్చే రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసే అధికారాలు ఈసీకి ఇవ్వాలని పేర్కొంటూ బీజేపీ నేత అశ్వనీ ఉపాధ్యాయ సుప్రీంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ఉచిత హామీలను ఆసరాగా చేసుకొనే కొన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంలోకి దిగుతున్నాయని, ఆర్థిక వ్యవస్థకు ఈ సంప్రదాయం ఎంతో నష్టదాయకమని వాదించారు. మరోవైపు, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో తాము భాగం కాలేమని ఈసీ వెల్లడించింది. ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులు ఉన్న కమిటీలో రాజ్యాంగబద్ధమైన సంస్థ ఉండకూడదని అభిప్రాయపడింది. ఇది సంస్థకు తీరని నష్టం చేకూర్చవచ్చని పేర్కొన్నది.