జమ్ము, ఆగస్టు 11: మరో మూడు రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనుండగా.. ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఉన్న సైనిక శిబిరంపై ఆత్మాహుతి దాడికి తీవ్రంగా ప్రయత్నించారు. బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో బాంబులు ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు సైనిక శిబిరం వద్దకు వచ్చారు.
ఆ సమయంలో ఇద్దరు సెంట్రీలు కాపలాగా ఉన్నారు. వీరి కన్నుగప్పి గేటులోనికి ప్రవేశించడానికి ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఇది గమనించిన సెంట్రీలు మిగతా జవాన్లను అప్రమత్తం చేశారు. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఇదే సమయంలో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులిద్దరూ హతమయ్యారు. దురదృష్టవశాత్త్తు నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.