న్యూఢిల్లీ: ఢిల్లీలోని రాజ్పథ్లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ, రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ తదితరులు రాజ్పథ్కు చేరుకున్నారు. అనంతరం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. తన కాన్వాయ్కు ముందు, వెనుక అశ్విక దళం కదిలిరాగా రాజ్పథ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా తన కారుదిగిన రాష్ట్రపతికి అశ్వికదళం గౌరవ వందనం సమర్పించింది.
ఆ తర్వాత సైనిక వందనం స్వీకరిస్తూ వేదిక దగ్గరకు చేరుకున్న రాష్ట్రపతికి త్రివిధ దళాల అధిపతులు, ప్రధాని నరేంద్రమోదీ, రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం పరేడ్ మొదలైంది. ముందుగా 155 హెలికాప్టర్ యూనిట్కు చెందిన నాలుగు Mi-17V5 హెలికాప్టర్లు ఆకాశంలో విన్యాసాలు చేశాయి. వైన్ గ్లాస్ ఫార్మేషన్ను ప్రదర్శించి వేడుకకు వచ్చిన ఆహుతులను ఆకట్టుకున్నాయి.
ముందు ఒకటి, దాని వెనుక మరొకటి, దానికి కొద్దిగా వెనుక ఎడమవైపున ఒకటి, కుడివైపున ఒకటి చొప్పున మొత్తం నాలుగు Mi-17V5 హెలికాప్టర్లు వెళ్తూ.. కిందికి కాడ, పైకి బౌల్తో ఉండే వైన్ గ్లాస్ ఆకారాన్ని ప్రదర్శించాయి. ఈ వైన్ గ్లాస్ ఫార్మేషన్ అబ్బురపర్చింది. కింది వీడియోలో ఆ వైన్ గ్లాస్ ఫార్మేషన్ను మీరు కూడా వీక్షించవచ్చు.