న్యూఢిల్లీ, జూన్ 20: భారత్లో ఖలిస్థాన్ వేర్పాటువాదాన్ని తిరిగి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఖలిస్థాన్ ఉగ్రవాద నేతలు వరుసగా మరణిస్తున్నారు. ఖలిస్థాన్ ముఖ్యనేత అమృత్పాల్సింగ్ ఇటీవల అరెస్టు అయిన సంగతి తెలిసిందే. తాజాగా కెనడాలో ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్సింగ్ నిజ్జర్ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఆరు నెలల వ్యవధిలోనే నలుగురు ఉగ్రవాద నేతలు హతమవడం గమనార్హం. వీరందరూ విదేశాల్లోనే మరణించారు. ఆదివారం గురుద్వారా వద్ద హర్దీప్సింగ్ మరణించగా, మిగతా వారు కూడా విదేశాల్లోనే మృతిచెందారు.
భారత ఎంబసీలపై దాడులు…
మే 6న లాహోర్లో తన ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తున్న ఖలిస్థాన్ కమాండర్ ఫోర్స్ చీఫ్ పరమ్జీత్ సింగ్ను దుండగులు బైక్పై వచ్చి కాల్చి చంపారు. గతవారం యూకేలో ఖలిస్థాన్ ముఖ్య నేత అవతార్సింగ్ ఖండా అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దవాఖానలో క్యాన్సర్కు చికిత్స పొందుతున్న ఆయన మరణించాడు. ఆయన మరణానికి విష ప్రయోగమే కారణమని పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది జనవరిలో లాహోర్లోని ఓ గురుద్వారా వద్ద హర్మీత్సింగ్ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. కాగా, నిజ్జర్ మృతికి భారత నిఘా విభాగం అధికారులే కారణమని కెనడాలోని సిక్కు సంస్థలు ఆరోపించాయి. ఇటీవల యూకే, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాలో ఖలిస్థాన్ ఉగ్రవాదుల ఆగడాలు శృతిమించాయి. భారత ఎంబసీ వద్ద ఆందోళనలు చేస్తున్నారు. లండన్లో భారత జెండాను అవమానించాలని ప్రయత్నించారు.