లక్నో: ఉత్తరప్రదేశ్లో మాజీ మంత్రి, బీజేపీ నేత ఆత్మారామ్ తోమర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఉదయం డ్రైవర్ వెళ్లి చూసే సరికి భాగ్పట్లోని తన ఇంట్లోనే బెడ్రూంలో మంచంపై విగతజీవిగా పడివున్నాడు. ఆయన మెడకు టవల్ చుట్టి వుంది. డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. ముందుగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహం పడివున్న తీరు, మెడకు టవల్ చుట్టి ఉండటం చూసి తర్వాత హత్య కేసుగా మార్చారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రోజూ లాగే ఈ ఉదయం కూడా డ్రైవర్ వెళ్లేసరి ఆత్మారామ్ తోమర్ ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. కాలింగ్ బెల్ కొట్టిన ఎంతసేపటికి తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన డ్రైవర్ ఇరుగుపొరుగును పిలిచి విషయం చెప్పాడు. అందరూ కలిసి తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి ఆత్మారామ్ తన బెడ్రూంలో మంచంపై విగత జీవిగా పడివున్నాడు. దాంతో డ్రైవర్ వెంటనే పోలీసులకు, ఆత్మారామ్ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు.
ప్రాథమిక విచారణ పూర్తిచేసిన పోలీసులు ఆత్మారామ్ కుటుంబానికి బాగా తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆత్మారామ్ స్కార్పియో కారు కూడా కనిపించకపోవడంతో.. తెలిసిన వాళ్లే ఆయనను హత్యచేసి బయటి నుంచి డోర్ లాక్ చేసి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. కాగా, ఆత్మరామ్లో 1997లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంత్రిగా పనిచేశారు.