మత రాజకీయాలను ఢీకొట్టిన జనహిత యోధుడు ములాయంసింగ్ యాదవ్ ఇకలేరు. సంక్షేమ రాజ్యానికి బాటలు వేసి ‘నేతాజీ’గా మన్ననలందుకొన్న సోషలిస్టు దిగ్గజం కన్నుమూశారు. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటాలతో రాటుదేలి, యూపీ పగ్గాలు చేపట్టి, ఆపై ఢిల్లీలో చక్రం తిప్పిన కురువృద్ధుని సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ముగిసింది. కాంగ్రెస్, బీజేపీలను ఢీకొట్టి నిలబడ్డ పహిల్వాన్ గోదా నుంచి నిష్క్రమించారు. రాంమనోహర్ లోహియా అనుయాయిగా, జయప్రకా శ్ నారాయణ్ శిష్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి చాణక్యం నడిపిన ములాయం సోమవారం కన్నుమూశారు. మూడుసార్లు యూపీ సీఎంగా, కేంద్ర మంత్రిగా పదవులు చేపట్టిన ములాయం మృతితో దేశరాజకీయాల్లో ఓ శకం ముగిసింది. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. నేడు యూపీలో అంత్యక్రియలకు హాజరవుతున్నారు.
గురుగ్రామ్/లక్నో, అక్టోబర్ 10: సమాజ్వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (82) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఆగస్టు 22 నుంచి గురుగ్రామ్లోని మేదాంత దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ములాయం తనయుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘నా తండ్రి, ప్రజల నేతాజీ ఇక లేరు’ అని పేర్కొన్నారు.
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు యూపీలోని ఇటావా జిల్లాలో ములాయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ములాయం మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో.. ప్రజాస్వామ్యానికి సైనికుడిలా పనిచేశారని ప్రధాని మోదీ కొనియాడారు. దేశరాజకీయాల్లో ఆయన లోటు పూడ్చలేనిదని కాంగ్రెస్ పేర్కొన్నది. ములాయం మృతి పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 3 రోజలు పాటు సంతాప దినాలు ప్రకటించారు. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
అనుచరులకెప్పుడూ నేతాజీనే!
యూపీ ప్రజలు, అనుచరులు, కార్యకర్తలు ములా యం సింగ్ను ముద్దుగా నేతాజీ అని పిలుచుకొంటారు. ఆయన రెజ్లర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో 10 సార్లు ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా, మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. సోషలిస్టు భావజాలం ఉన్న ములాయం.. 1967లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1975లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఆయనను అరెస్టు చేసి 19 నెలలు జైల్లో ఉంచారు. 1977లో తొలిసారి మంత్రి పదవి చేపట్టారు. 1980లో ఉత్తరప్రదేశ్లోని లోక్దళ్ అధ్యక్షుడయ్యారు.
1982లో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. 1985లో యాదవ్ క్రాంతికారి పార్టీని స్థాపించారు. 1989లో సీఎం పదవి చేపట్టారు. 1991లో కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవటంతో పదవిని కోల్పోయారు. 1992లో ఎస్పీని స్థాపించి 1993లో సీఎం అయ్యారు. 1995 వరకు ఆ పదవిలో కొనసాగారు. మూడోసారి.. 2003లో సీఎంగా బాధ్యతలు చేపట్టి 2007 వరకు పనిచేశారు. 1996లో ఎంపీగా ఎన్నికై, యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఎంపికయ్యారు. ఆ సమయంలో ప్రధాని పదవికి ములాయం పేరును సూచించినా, లాలూ, శరద్యాదవ్ వ్యతిరేకించటంతో ప్రధాని అయ్యే అవకాశాన్ని కోల్పోయారు.
ములాయం సింగ్ వ్యక్తిగత జీవితం
పుట్టిన రోజు: 1939 నవంబర్ 22
పుట్టింది: యూపీలోని ఇటావా జిల్లా సైఫయీ
తల్లిదండ్రులు: మూర్తిదేవి, సుఘర్సింగ్ యాదవ్ (వ్యవసాయ కుటుంబం)
పూర్తి పేరు: ములాయం సింగ్ యాదవ్
ప్రజలు పెట్టుకొన్న పేరు: నేతాజీ
చదువు: ఎంఏ (పొలిటికల్ సైన్స్)
ఆసక్తి: రెజ్లింగ్
భార్యలు: ఇద్దరు (మాలతీ దేవి, సాధనా యాదవ్ (2003లో పెండ్లి))
పిల్లలు : అఖిలేశ్ యాదవ్ (మాలతీ దేవి) ప్రతీక్ యాదవ్ (సాధనా యాదవ్)
ఉద్యోగం: రాజకీయాల్లోకి రాకముందు లెక్చరర్గా పనిచేశారు
రాజకీయ జీవితం: రాజకీయాల్లోకి ఎంట్రీ: 1960
ఎస్పీ స్థాపన : 1992 అక్టోబర్ 4
కేంద్ర రక్షణశాఖ మంత్రిగా: 1996-98
సీఎంగా: 3 సార్లు (1989-91, 1993-95, 2003-07)
ఎంపీగా: 7 సార్లు
ఎమ్మెల్యేగా: 10 సార్లు