Manmohan Singh | న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఆర్థిక వేత్తగా అడుగుపెట్టి.. ప్రధాని పీఠాన్ని పడేండ్ల పాటు అధిష్ఠించి ఎన్నో ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 33 ఏండ్ల పార్లమెంటరీ ప్రస్థానం బుధవారంతో ముగిసింది. తొమ్మిది మంది కేంద్రమంత్రులు, 44 మంది ఇతరులతో పాటు ఆయన కూడా రాజ్యసభకు వీడ్కోలు పలికారు. కాగా, మన్మోహన్ సింగ్ రాజ్యసభ ప్రస్థానం ముగియగా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తొలిసారి రాజ్యసభలోకి అడుగుపెడుతుండటం విశేషం.
ఆర్థిక సంస్కరణవేత్తగా పేరొందిన 91 ఏండ్ల మన్మోహన్ సింగ్ 1991 అక్టోబర్లో తొలిసారిగా రాజ్యసభలోకి ప్రవేశించారు. పీవీ నరసింహారావు హయాంలో 1991-96 మధ్య దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన 2004 నుంచి 2014 వరకు పదేండ్ల పాటు దేశ ప్రధానిగా సేవలందించారు. కాగా, ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ సభ్యుల వీడ్కోలు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ.. దేశానికి, ప్రజాస్వామ్యానికి మన్మోహన్ అందించిన సేవలను ప్రశంసించారు.
ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో వీల్చైర్పై వచ్చి ఓటు వేయడాన్ని ఆయన ప్రస్తావిస్తూ అది ఆయన అంకితభావం, నిబద్ధతను తెలియజేస్తుందని అన్నారు. కాగా, రాజ్యసభ పదవీ కాలం ముగిసిన తొమ్మిది మంది కేంద్ర మంత్రులలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఎల్.మరుగన్ తప్ప మిగిలిన వారంతా వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరిద్దరికీ మరోసారి రాజ్యసభ సభ్యులుగా ప్రధాని మోదీ అవకాశం కల్పించారు.
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన 12 మంది సభ్యులతో చైర్మన్ జగదీప్ ధన్ఖర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో ధర్మశీలగుప్తా, మనోజ్కుమార్ ఝా, సంజయ్యాదవ్, గోవింద్భాయ్ లాల్జీభాయ్ ధోలాకియా, సుభాష్చందర్, హర్షమహాజన్, జీసీ చంద్రశేఖర్, ఎల్ మురుగన్, అశోక్సింగ్, చంద్రకాంత్ హండోర్, మేధా విశ్రామ్ కుల్కర్ణి, సాధనాసింగ్ ఉన్నారు. పార్లమెంటు హౌస్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, సెక్రటరీ జనరల్ పీకే మోదీ హాజరయ్యారు. ఈ నెల 2, 3 తేదీల్లో కలిపి రాజ్యసభ నుంచి 54 మంది సభ్యులు రిటైరయ్యారు.