న్యూఢిల్లీ: రైతుల సంక్షేమానికి విశేష కృషి చేసిన మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్న అవార్డు ప్రకటించడం పట్ల సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) హర్షం వ్యక్తం చేసింది. అయితే అదే సమయంలో పంటల కనీస మద్దతు ధరపై స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులపై ప్రజల దృష్టిని మళ్లించడానికి కేంద్రం చేసిన ప్రయత్నంగా అవార్డుల ప్రకటనను విమర్శించింది. ఈ మేరకు ఎస్కేఎం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. సంక్షోభంలో ఉన్న రైతుల సమస్యలను తీర్చడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది. చరణ్ సింగ్, స్వామినాథన్లకు భారతరత్న ప్రకటించకపోయినా వారు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని పేర్కొంది.