రాష్ర్టాల అస్తిత్వానికి మోదీ సర్కారు డేంజర్
కేంద్రం వివక్ష.. ప్రజాస్వామ్యానికి దెబ్బ
ప్రాంతీయ శక్తులు ఏకం కావాలి
మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్
ముందుకుపోవాలని దేవెగౌడ ఆశీస్సులు
ఇద్దరి మధ్య రెండున్నర గంటల చర్చలు
రాష్ట్ర ప్రగతిపై అబ్బురపడిన దేవెగౌడ
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): దేశంలో ప్రజల ఎజెండాతో ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పడాల్సిన అనివార్యత నెలకొన్నదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసి దొడ్డిదారిన ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తున్న బీజేపీ వైఖరి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిందని, ఈ పోకడను నిలువరించకుంటే రాష్ర్టాల అస్తిత్వానికే ప్రమాదమని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాల పట్ల ప్రజలకు విశ్వాసం పోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. గురువారం మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ సమావేశమయ్యారు. ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం.. బెంగళూరులో నేరుగా దేవెగౌడ ఇంటికి వెళ్లారు.
తన వెంట వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులను దేవెగౌడ, కుమారస్వామికి పరిచయం చేశారు. యోగక్షేమాలు పూర్తయ్యాక కలిసి భోజనంచేశారు. కురువృద్ధ రాజకీయ నేతతో కేసీఆర్ రెండున్నర గంటలపాటు చర్చలు జరిపారు. తన ఢిల్లీ పర్యటన విశేషాలను పంచుకొన్నారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్మాన్, సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేశ్యాదవ్తో జరిపిన చర్చల సారాన్ని వివరించారు. దేశంలో నెలకొన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక స్థితిగతులపై పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, సామాజిక ఉద్యమకారులు, వి విధ రంగాల నిపుణులతో జరిపిన చర్చల వివరాలను తెలిపారు. దేశంలో ప్రాంతీయ పార్టీల నేతృత్వంలో ప్రజల ఎజెండాతో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రూపుదాల్చాల్సిన అనివార్యత ఉందని, తాను వివిధ వర్గాల ప్రజలతో, మేధావులతో జరిపిన చర్చల సందర్భంగా ఇదే అభిప్రాయం వ్యక్తమైందని వివరించారు.
కాంగ్రెస్ బలహీనతే.. బీజేపీ బలం
దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీనత, ఆ పార్టీ నాయకత్వ అపరిపక్వత మొదలైన అంశాలు బీజేపీకి కలిసివస్తున్నాయని, అందుకే బీజేపీ బలంగా చెలామణి అవుతున్న సందర్భాలను కేసీఆర్ వివరించినట్టు సమాచారం. కేంద్ర సర్కారు రాష్ర్టాలపై ఏకపక్ష.. వివక్షాపూరిత వైఖరి పట్ల దేశంలోని వివిధ సామాజిక రంగాల నిపుణులు, బుద్ధిజీవులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఆలాంటి వర్గాలకు ధైర్యాన్నిచ్చే వేదిక లేకపోవడంపైనా దేవెగౌడతో కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తున్నది. దేశ రాజకీయాలు, మోదీ సర్కార్ వివక్షాపూరిత వైఖరిపై దేవెగౌడ అందోళన చెందినట్టు సమాచారం. ఈ పరిస్థితిని నిలువరించాలని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.
కేసీఆర్.. గో ఎహెడ్
బలమైన కేంద్రం.. బలహీన రాష్ర్టాలు అనే బీజేపీ విధానాన్ని ఉమ్మడిగా ప్రాంతీయ పార్టీలు ఎదుర్కొని దేశ సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షించాలనే అభిప్రాయానికి దేవెగౌడ, కేసీఆర్ వచ్చినట్టు సమాచారం. ‘మీరు చేస్తున్న ప్రయత్నాలు అపకుండా కొనసాగించండి.. గో ఎహెడ్ కేసీఆర్’ అని దేవెగౌడ్ సీఎం కేసీఆర్ భుజం తట్టినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
రాష్ట్ర ప్రగతిపై అబ్బురపడిన దేవెగౌడ
తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న పురోగతిపై మాజీ ప్రధాని దేవెగౌడ సీఎం కేసీఆర్ను అభినందించారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి, ప్రత్యేకించి టీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమాలను ఇరువురు నేతలు పంచుకొన్నారు. గతంలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్లో ఏప్రిల్ 27, 2003న నిర్వహించిన భారీ బహిరంగ సభ ‘తెలంగాణ జైత్రయాత్ర’ను దేవెగౌడ గుర్తు చేసుకొన్నారు. అజిత్సింగ్తో హైదరాబాద్ నుంచి వరంగల్ దాకా కలిసి చేసిన ప్రయాణాన్ని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించిందని, ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని, అది దేశమంతటికీ వ్యాపించాలని దేవెగౌడ ఆకాక్షించినట్టు సమాచారం. సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ బృం దం, కుమారస్వామి, రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రజాప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఆ తరువాత ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి బయలుదేరి రాత్రి హైదరాబాద్ చేరుకొన్నారు.