ముంబై: ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్.. ఇవాళ విచారణకు హాజరయ్యారు. మహారాష్ట్రలో ఆయనపై నాలుగు బెదిరింపు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. అక్టోబర్ నుంచి పరారీలో ఉన్న పరంబీర్ సింగ్.. ఇవాళ అనూహ్యంగా నగరంలోని క్రైం బ్రాంచీ యూనిట్ 11 పోలీసుల ముందు హాజరయ్యారు. ఆదివారం చంఢీఘడ్లో పరంబీర్సింగ్ కనిపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాను విచారణలో పాల్గొనున్నట్లు ఆయన తెలిపారు. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరంబీర్కు సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది. పరంబీర్ను అరెస్టు చేయవద్దు అంటూ సోమవారం సుప్రీం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. తానేమీ దేశం విడిచి వెళ్లలేదని కూడా కోర్టుకు ఆయన తెలిపారు.
గోరేగావ్ బెదిరింపు కేసులో విచారణ ఎదుర్కొనేందకు ఇవాళ పరంబీర్ సింగ్ .. కండీవలిలోని క్రైమ్ బ్రాంచీ యూనిట్ 11 పోలీసుల ముందు హాజరయ్యారు.మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముక్ అవినీతికి పాల్పడినట్లు పరంబీర్ ఆరోపించారు. ఆ కేసులో ప్రస్తుతం దేశ్ముఖ్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. అయితే పరంబీర్ మాత్రం చాన్నాళ్ల నుంచి పరారీలో ఉన్నారు.