Shanti Bhushan | కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి, సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్ (97) మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని నివాసంలో ఆయన కన్నుమూశారు. ఆయన 1977-79 నుంచి వరకు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేశారు. 2009లో దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆయన తనయుడే. 1974లో ఇందిరాగాంధీ లోక్సభ సభ్యత్వాన్ని సవాల్ చేసిన రాజ్ నారాయణ తరఫున శాంతి భూషణ్ అలహాబాద్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పును వెలువరించింది.
14 జూలై 1977 నుంచి 2 ఏప్రిల్ 1980 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. ఇందిరాగాంధీతో విభేదాలు ఏర్పడి చీలిపోయిన కాంగ్రెస్ (ఓ) పార్టీలో సేవలందించారు. ఆ తర్వాత జనతా పార్టీలో, 1980లో బీజేపీలో చేరారు. 1986లో ఎన్నికల పిటిషన్పై బీజేపీ పార్టీ ఆయన సలహాలను అంగీకరించకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో శాంతి భూషణ్ సైతం ఒకరు. 2018లో ‘మాస్టర్ ఆఫ్ రోస్టర్’ విధానాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ శాంతిభూషణ్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. రోస్టర్ కింద బెంచ్కు కేసులను పంపే సూత్రం, విధానాన్ని నిర్ణయించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఆ పిటిషన్ను ఆయన తన తనయుడు ప్రశాంత్ భూషణ్ ద్వారా ఈ పిటిషన్ను దాఖలు చేశారు.