Satyendra jain | హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం, అయినా లొంగకపోతే బూటకపు కేసులు బనాయించి ఏండ్ల తరబడి జైళ్లలో మగ్గేలా చేయడం… కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుటిల నీతిగా మారింది. ఇందుకు నిలువెత్తు సాక్ష్యమే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ తాజా దయనీయ పరిస్థితి. ప్రస్తుతం ఆయన చావుబతుకుల మధ్య ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తీహార్ జైల్లో మగ్గుతున్న సత్యేంద్ర జైన్ అనారోగ్యంతో గురువారం తెల్లవారుజామున బాత్రూంలో జారిపడ్డారు. లోక్నాయక్ దవాఖానలో ఆక్సిజన్ సపోర్టుతో చికిత్స అందిస్తున్నారు.
బెయిల్ అడిగినా తిరస్కరణ…
సత్యేంద్ర జైన్ ఆరోగ్య పరిస్థితి రోజూరోజుకు క్షీణిస్తున్నదని ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తెలిపారు. జైల్కు వచ్చాక ఆయన 35 కిలోల బరువు తగ్గారని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఎముకుల గూడులా మారిన విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి బెయిల్ కోరినా తిరస్కరించినట్టు సింఘ్వీ తెలిపారు.
బీజేపీ అహంకారం,
అరాచకత్వానికి నిదర్శనం…
సత్యేంద్ర జైన్ జైలుకు వెళ్లకముందు, ప్రస్తుతం ఆయన పరిస్థితిని పోల్చుతూ ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం తన ట్విట్టర్లో రెండు ఫొటోలను పోస్టు చేశారు. ‘బీజేపీ సర్కార్ అహంకారానికి, వేధింపులకు పరాకాష్ట’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.