న్యూఢిల్లీ: మహాసైన్య నాయకుడు.. కొత్త శక్తి.. కొత్త మార్గాన్ని ఇచ్చిన బహదూర్ బిపిన్ రావత్కు ఇవాళ ఘన నివాళి పలికారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ చీఫ్ రావత్ దంపతలుకు ఇవాళ సైనిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు నిర్వహించారు. బరార్ స్క్వేర్ శ్మశానవాటికలో పలువురు రావత్ భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీలంక ఆర్మీ కమాండర్ జనరల్ శవేంద్ర సిల్వా, రాయల్ భూటాన్ ఆర్మీ డిప్యూటీ ఆఫీసర్ బ్రిగేడియర్ దోర్జీ రింన్చెన్, నేపాల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ బాల్ కృష్ణ కార్కి, బంగ్లాదేశ్ ఆర్మడ్ ఫోర్సెస్ డివిజన్ ఆఫీసర్ లెఫ్టినెంట్ వాకర్ ఉజ్ జమాన్లు రావత్ దంపతుల పార్దీవదేహాలకు పుష్ప నివాళి అర్పించారు.
బ్రిటీషన్ హై కమీషనర్ అలెక్స్ ఎల్లిస్ కూడా పుష్ప నివాళి అర్పించారు. రావత్ మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జాయింట్ డిఫెన్స్ విధానాన్ని రావత్ ప్రారంభించారని, దాన్ని తాము ఫాలో అవుతున్నట్లు ఆయన తెలిపారు. గొప్ప నేతను, సైనికుడిని ఇండియా కోల్పోయిందన్నారు. ఫ్రాన్స్ అంబాసిడర్ ఎమ్మాన్యువెల్ లినాయిన్ కూడా రావత్ దంపతులకు పుష్పాంజలి ఘటించారు. రావత్ గొప్ప సైనిక నేత అని ఆయన అన్నారు. బరార్ స్క్వేర్ శ్మశానవాటికలో ..కొంత సేపు రావత్ దంపతులు శవపేటికను శ్రద్ధాంజలి కోసం ఉంచారు. బిపిన్ శవపేటికను జాతీయ జెండాతో కప్పారు.