Eknath Shinde | మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ఆల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. సోమవారం అర్ధరాత్రి పొద్దు పోయిన తర్వాత సుమారు 21 మంది శివసేన ఎమ్మెల్యేలతో కలిసి ముంబై నుంచి సూరత్కు చేరుకున్న ఏక్నాథ్ షిండేతో ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం 10 నిమిషాలు ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఈ చర్చల్లో ఎటువంటి పురోగతి లేదని వారి సన్నిహిత వర్గాలు తెలిపాయి. బీజేపీతో అలయెన్స్ పునరుద్ధరించి, రాష్ట్రంలోని తిరిగి అధికారంలోకి రావాలని ఉద్ధవ్ ఠాక్రేకు షిండే షరతు విధించినట్లు తెలుస్తున్నది.
తిరిగి వెనుకకు రావాలని ఏక్నాథ్ షిండేను ఉద్ధవ్ ఠాక్రే కోరినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. పార్టీ భవిష్యత్ కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేనని, ఎటువంటి డాక్యుమెంట్పై సంతకం చేయలేనని షిండే తెగేసి చెప్పినట్లు సమాచారం. అంతకుముందు ఉద్ధవ్ ఠాక్రే దూతలుగా ఇద్దరు శివసేన సీనియర్ నాయకులు.. సూరత్లో క్యాంప్ వేసిన ఏక్నాథ్ షిండేతో చర్చలు జరిపారు.
ఇదిలా ఉంటే, ఏక్నాథ్ షిండేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధం అని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం మధ్యాహ్నం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో చీఫ్విప్, పార్టీలో కీలక పదవి నుంచి ఏక్నాథ్షిండేను తొలగిస్తూ ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు వార్తలు రావడంతో ఏక్నాథ్ షిండేకు, సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు మధ్య దూరం పెరిగిందని సమాచారం.