న్యూఢిల్లీ : అత్యవసర వైద్యం అందించేందుకు భారత్ సరికొత్త సాంకేతికతపై పని చేస్తున్నది.
ఆసియాలోనే తొలిసారిగా కంటైనర్ హాస్పిటల్ను తీసుకురానున్నది. ఎప్పుడైనా.. ఎక్కడికైనా వాయు, జల, రహదారి మార్గాల ద్వారా చేరుకొని 24 గంటల్లో వైద్యసేవలు అందించనున్నారు. ఇందులో పరిశోధన నుంచి ఐసీయూ, వెంటిలేటర్ సేవలూ అందుబాటులో ఉండనున్నాయి. తుఫాను, అంటువ్యాధులు, భూకంపాలు తదితర అత్యవసర పరిస్థితుల్లోనూ వాటిని ఉపయోగించుకోవచ్చు. విమానాలు, రైలు, నౌకల ద్వారా ఎక్కడికైనా తరలించే అవకాశం ఉన్నది. సుమారు 36 మీటర్ల పొడవు, 32 మీటర్ల వెడెల్పుతో ఉంటుంది. రేడియో డయాగ్నస్టిక్ సౌకర్యం, సాధారణ, ఐసీయూ, వెంటిలేటర్ బెడ్లతో పాటు ఐసోలేషన్ వార్డులను కూడా ఏర్పాటు చేయనున్నారు.
కంటైనర్లోనే వైద్యులు, నర్సులకు ప్రత్యేకంగా క్యాబిన్లు ఉంటాయి. కంటైనర్ హాస్పిటల్పై ఆరోగ్యశాఖ మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వివరించారు. కంటైనర్లను ఒకే చోట సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కొన్నింటిలో పరీక్షా సౌకర్యాలు, పడకలు, మరికొన్నింటిలో ఇతర పరికరాలు ఉంటాయి. కొన్ని కంటైనర్లను కలిపి అక్కడికక్కడే ఆసుపత్రిగా మారే విధంగా ఉంటాయని, ప్రస్తుతం వంద పడకల ఆసుపత్రులను నిర్మాణమవుతున్నాయన్నారు. ఎందుకంటే ఎక్కువ పడకలు ఒక కంటైనర్లో ఉంచలేమని.. కాబట్టి కంటైనర్లన్నీ ఒకే చోట సిద్ధంగా ఉంచనున్నట్లు వివరించారు.
చిన్నవి, పెద్దవి తేడా లేకుండా అన్ని రకాల కంటైనర్లను తయారు చేస్తున్నారు. ఆరు మీటర్ల పరిమాణంలో ఉన్న కంటైనర్లు కూడా ఉన్నాయి. వీటిలో చిన్న పరికరాలు ఉంచనున్నారు. కొన్ని 20 అడుగుల వెడెల్పు వరకు ఉంటాయి. కంటైనర్ ఆసుపత్రులు వైద్యులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలకు సైతం పూర్తిగా సురక్షితంగా ఉండనున్నాయి. అలాగే రోగి వెలుపల దూరం నుంచి కూడా కనిపించే విధంగా కంటైనర్లను సిద్ధం చేస్తున్నారు. కంటైనర్ ఆసుపత్రిపై ప్రణాళికపై సాంకేతిక, వైద్య రంగాల సహాయం తీసుకున్నారు. ఐఐటీ, ఢిల్లీ ఎయిమ్స్ నిపుణులు కంటైనర్ ఆసుపత్రి నమూనాపై కలిపి పని చేశారు.
అత్యవసర సమయాల్లో వైద్యసేవలందిచడానికి కేంద్ర ప్రభుత్వం కంటైనర్ ఆధారిత సంచార ఆసుపత్రులను నెలకొల్పనున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ కింద వీటిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వంద పడకల సామర్థ్యం గల కంటైనర్లను ఏర్పాటు చేస్తామన్నారు. అవసరం మేరకు వాటిని రైలు, వాయు మార్గాల్లో తరలించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. ఢిల్లీ, చైన్నైలో వీటిని నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు.