న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 19 ప్రపంచవ్యాప్త చానళ్లపై నిషేధం విధించింది. పాకిస్థాన్కు చెందిన 35 యూట్యూబ్ చానళ్లపై భారత్ నిషేధం విధించిన నేపథ్యంతోపాటు భారత గణతంత్ర దినోత్సవానికి ముందు ఈ చర్య చేట్టడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
గత ఏడాది డిసెంబర్ 21న, 20 విదేశీ యూట్యూబ్ చానళ్లు, రెండు వెబ్సైట్లను భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిషేధించింది. అలాగే భారత వ్యతిరేక ప్రచారంతోపాటు తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్న 35 యూట్యూబ్ చానళ్లు, రెండు వెబ్సైట్లు, రెండు ఇన్స్టాగ్రామ్, రెండు ట్విట్టర్, ఒక ఫేస్బుక్ ఖాతాలను కూడా ఈ నెల 20న కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈవన్నీ కూడా పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్నాయని తెలిపింది.
కాగా, భారత్ నిషేధం విధించిన రెండు రోజులకే యూట్యూబ్ కూడా ఈ దిశగా చర్యలు చేపట్టింది. ‘యాంటీ-ఇండియా’ ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు ప్రపంచ వ్యాప్తంగా 19 చానళ్లను శనివారం నిషేధించింది. అయితే భారత్ నిషేధించిన యూట్యూబ్ చానళ్లు కూడా ఇందులో ఉండవచ్చని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు ఈ నిషేధాలపై భయాందోళన చెందుతున్న ఇతర యూట్యూబ్ చానళ్లు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. భారత వ్యతిరేక ప్రచార వీడియోలను తీసివేయడం ప్రారంభించాయి. అయితే రానున్న రోజుల్లో భారత వ్యతిరేక ప్రచారాలకు సంబంధించి మరిన్ని యూట్యూబ్ చానళ్లను నిషేధించే అవకామున్నది తెలుస్తున్నది.