భోపాల్: మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ, సాద్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మొబైల్ ఫోన్కు అసభ్యకర సందేశాలు, వీడియోలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్కు తొలుత గుర్తు తెలియని నంబర్ నుంచి అసభ్యకర వీడియో వచ్చిందని ఒక పోలీస్ అధికారి తెలిపారు. దీంతో ఆమె వీడియో కాల్ను కట్ చేశారని చెప్పారు. అనంతరం ఒక అసభ్య సందేశం ఆమెకు వచ్చిందన్నారు.
వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసి ఆమె ప్రతిష్టను దెబ్బతీస్తానంటూ అందులో బెదిరించినట్లుగా ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఫిర్యాదు చేశారని పోలీస్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, మాలేగావ్ పేలుడు కేసులో నిందితురాలైన ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, అనారోగ్య కారణాలతో బెయిల్పై విడుదలయ్యారు. అయితే పలు కార్యక్రమాల్లో ఆమె చురుకుగా వ్యవహరిస్తున్నారు. బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు కొన్ని సందర్భాల్లో బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, క్రికెట్ వంటి క్రీడలు ఆడారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆమె ఆరోగ్యంగానే ఉన్నారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.
అయితే తాజాగా ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మళ్లీ వార్తల్లో నిలిచారు. తన మొబైల్ ఫోన్కు అసభ్య వీడియో, సందేశం వచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పరువునకు నష్టం కలిగించే కుట్ర జరుగుతున్నదని ఆమె ఆరోపించారు.