చండీగఢ్: గుడ్డు కూర వండేందుకు నిరాకరించడంతో సహజీవనం చేస్తున్న మహిళను ఒక వ్యక్తి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. నిర్మాణంలో ఉన్న ఇంటి యజమాని ఆ మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చివరకు పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
(Man Kills Live-In Partner) బీహార్ మాధేపురా జిల్లాలోని ఔరాహి గ్రామానికి చెందిన 35 ఏళ్ల లల్లన్ యాదవ్, ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్లో ఉంటున్నాడు. చెత్త ఏరుకునే 32 ఏళ్ల అంజలి అతడికి పరిచయమైంది. దీంతో వారిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు.
కాగా, చౌమా గ్రామంలో ఇంటిని నిర్మిస్తున్న వ్యక్తి మార్చి 10న గురుగ్రామ్ బస్టాండ్ వద్ద ఉన్న లల్లన్ యాదవ్, అంజలిని పనుల కోసం తీసుకొచ్చాడు. రెండు రోజులుగా వారు నిర్మాణ స్థలం వద్ద ఉన్నారు. అయితే గుడ్డు కూర వండనందుకు ఆగ్రహించిన యాదవ్ సుత్తితో కొట్టి, బెల్టుతో మెడ బిగించి అంజలిని హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు నిర్మాణంలో ఉన్న ఇంటి యజమాని, అంజలి మృతదేహాన్ని బుధవారం గుర్తించాడు. దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో లల్లన్ యాదవ్ను అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించగా అంజలిని తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆరేళ్ల కిందట పాము కాటు వల్ల తన భార్య చనిపోయినట్లు చెప్పాడు. ఏడు నెలల కిందట పరిచయమైన అంజలితో కలిసి సహజీవనం చేస్తున్నట్లు వెల్లడించాడు.