ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో నవంబర్ 3న జరుగనున్న అంధేరి నియోజకవర్గం ఉపఎన్నిక శివసేన రెండు వర్గాల మధ్య పోరుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం అభ్యర్థిపై అనిశ్చితి నెలకొన్నది. శివసేన సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ లట్కే కొన్ని నెలల కిందట మరణించారు. దీంతో అంధేరిలో ఉప ఎన్నికకు దారి తీసింది. ఆయన భార్య రితుజా లట్కేను అభ్యర్థిగా నిలుపాలని ఉద్ధవ్ ఠాక్రే వర్గం నిర్ణయించింది. దీంతో బృహన్ ముంబై కార్పోషన్ (బీఎంసీ)లో పని చేస్తున్న ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది.
కాగా, బీజేపీ మద్దతుతో సీఎం అయిన శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే వర్గం దీనిని అడ్డుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఆమె రాజీనామాను బీఎంసీ ఇంకా ఆమోదించలేదు. ఈ నెల 14తో నామినేషన్ గడువు ముగియనుంది. ఈలోపు రితుజా లట్కే రాజీనామాను బీఎంసీ ఆమోదించకపోతే ఉద్ధవ్ వర్గం అభ్యర్థిగా ఆమె పోటీ చేయడం కుదరదు.
మరోవైపు షిండే వర్గం కూడా రితుజా లట్కేపై ఒత్తిడి తెస్తున్నది. తమ తరుఫున పోటీ చేయాలని బేరసారాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఆమె రాజీనామా ఆమోదంపై నిర్ణయానికి సమయం ఉందంటూ బీఎంసీ చీఫ్ ఇక్బాల్ సింగ్ చాహల్ తెలిపారు. కాగా, తన రాజీనామాను బీఎంసీ త్వరగా ఆమోదించాలని కోరుతూ బాంబే హైకోర్టును రితుజా ఆశ్రయించారు. హైకోర్టు ఆమె పిటిషన్పై గురువారం విచారణ జరుపనున్నది.