ముంబై: కుక్కను బైక్తో ఢీకొట్టిన వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఆ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా పోలీసులపై మండిపడింది. అంతేగాక వారికి జరిమానా కూడా విధించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. 2020లో లాక్డౌన్ సమయంలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ మానస్ గాడ్బోలే బైక్పై వెళ్తూ మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో వీధి కుక్కను ఢీకొట్టాడు. ఈ సందర్భంగా బైక్ జారి పడటంతో అతడు కూడా గాయపడ్డాడు.
కాగా, వీధి కుక్కలకు ఆహారం పెట్టే మహిళ, మానస్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మానస్ దీనిపై బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే, పృథ్వీరాజ్ చవాన్లతో కూడిన డివిజన్ బెంచ్ అతడి పిటిషన్పై విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీసులకు కోర్టు చీవాట్లు పెట్టింది. కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులను వాటి యజమానులు పిల్లలు లేదా కుటుంబ సభ్యులుగా పరిగణించినప్పటికీ జీవశాస్త్రం ప్రకారం అవి మనుషులు కాదని కోర్టు పేర్కొంది.
బైక్తో ఢీకొట్టిన కారణంగా జంతువుకు గాయమైనందుకు మానవ ప్రాణాలకు హాని లేదా గాయం కలిగించే భారత శిక్షాస్మృతిలోని 279, 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడాన్ని బాంబే హైకోర్టు తప్పుపట్టింది. ఆ వ్యక్తిపై నమోదైన కేసులను కొట్టివేసింది. అంతేగాక అతడికి కోర్టు ఖర్చుల కింద రూ.20,000 చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు నమోదు చేసిన పోలీస్ అధికారుల జీతం నుంచి ఈ డబ్బులు వసూలు చేయాలని పేర్కొంది. డిసెంబర్ 20న ఈ మేరకు తీర్పు ఇచ్చింది.