అహ్మదాబాద్: ఒక దళిత వ్యక్తి (Dalit Man Thrashed) మంచి దుస్తులు ధరించడంతోపాటు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఇది చూసి సహించలేని అగ్రవర్ణాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు అతడిపై దాడి చేశారు. బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. బనస్కాంత జిల్లా మోటా గ్రామానికి చెందిన జిగర్ షెఖాలియా దళిత వ్యక్తి. మంగళవారం తన ఇంటి ముందు నిల్చొన్నాడు. అగ్ర వర్ణాలకు చెందిన ఒక వ్యక్తి అతడి వద్దకు వచ్చాడు. చాలా ఎత్తుకు ఎదుగుతున్నావని అన్నాడు. అతడి స్థాయిలో ఉండకపోతే చంపుతానని బెదిరించాడు.
కాగా, మంగళవారం రాత్రి గుడి వద్ద ఉన్న జిగర్ వద్దకు అగ్ర వర్ణాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు వచ్చారు. వారి చేతుల్లో కర్రలు ఉన్నాయి. మంచి దుస్తులు ధరించి, చలువ కళ్లద్దాలు పెట్టుకోవడాన్ని వారు ప్రశ్నించారు. అతడ్ని కర్రలతో కొట్టారు. డైరీ పార్లర్ వెనుకకు ఈడ్చుకెళ్లారు. దీనిని గమనించిన జిగర్ తల్లి పరుగున అక్కడకు వచ్చింది. దీంతో ఆ వ్యక్తులు ఆమెను కూడా కొట్టారు. ఆమె దుస్తులను చించారు. చంపుతామని వారిద్దరినీ బెదిరించారు.
మరోవైపు జిగర్ షెఖాలియా, అతడి తల్లి ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజపుత్ వర్గానికి చెందిన ఏడుగురు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీస్ అధికారి తెలిపారు.