చండీఘఢ్ : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన చండీఘఢ్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్, హార్స్ రేసింగ్, లాటరీలపై 28 శాతం జీఎస్టీ విధింపు ప్రతిపాదనపై నిర్ణయం వాయిదా పడింది. జులై 15 నాటికి క్యాసినోలు, గేమింగ్, రేసింగ్, లాటరీలపై పన్ను రేటును తిరిగి మదింపు చేయాలని మేఘాలయ సీఎం కన్నాడ్ సంగ్మా నేతృత్వంలోని మంత్రుల బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్ కోరింది.
జీఎస్టీ కౌన్సిల్ తదుపరి భేటీలో ఈ నివేదికపై చర్చలు జరుపుతారు. ఆగస్ట్ తొలి వారంలో మంత్రుల బృందం అజెండాపై జీఎస్టీ కౌన్సిల్ మరోసారి సమావేశం కానుంది. క్యాసినోలను ప్రత్యేకంగా పరిగణించాలని గోవా కోరడంతో ఆన్లైన్ గేమ్స్, హార్స్ రేసింగ్, క్యాసినోలపై మరోసారి సంప్రదింపులు జరపాలని మంత్రుల బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్ కోరిందని సమావేశం అనంతరం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న పలు నిర్ణయాలను ఆమె వెల్లడించారు. ఈ సమావేశంలో పన్ను రేట్ల హేతుబద్దీకరణ కమిటీ, క్యాసినో, హార్స్ రైడింగ్, లాటరీలపై పన్ను రేటు మదింపు, ఐటీ, టెక్నాలజీ సంబంధిత అంశాలపై చర్చించామని చెప్పారు.