తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయం (Thiruvananthapuram airport) లో ఈ నెల 23న 5 గంటలపాటు విమాన సర్వీసులు నిలిపివేయనున్నారు. ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయ సాంప్రదాయమైన ‘ఆరట్టు’ ఊరేగింపు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తిరువనంతపురం ఎయిర్పోర్ట్ తెలిపింది. పద్మనాభస్వామి ఆలయంలో జరిగే అల్పాసి ఆరట్టు ఊరేగింపు సందర్భంగా అక్టోబర్ 23 సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విమాన సేవలను నిలిపివేస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. ఫ్లైట్స్ అప్డేట్ టైమింగ్స్ కోసం ఆయా ఎయిర్లైన్స్ను సంప్రదించాలని సూచించింది.
కాగా, శతాబ్దాలుగా పద్మనాభస్వామి ఆలయంలోని విగ్రహాల పవిత్ర స్నానం కోసం షంగుముఖం బీచ్ వరకు ప్రతి ఏటా రెండు సార్లు ఊరేగింపు నిర్వహిస్తారు. 1932లో ఎయిర్పోర్ట్ నిర్మించినప్పటికీ రన్ వే మీదుగా ఈ ఊరేగింపు కొనసాగుతున్నది. తిరువనంతపురం ఎయిర్పోర్ట్ నిర్వహణ బాధ్యతలను ప్రస్తుతం అదానీ గ్రూప్ చేపట్టినప్పటికీ ఏళ్లనాటి రాచరిక సాంప్రదాయ ఆచారం కోసం ఈ నెల 23న ఐదు గంటలపాటు విమాన సర్వీసులు నిలిపివేయనున్నారు.