బడంగ్పేట, జూన్1: ట్రంక్ లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు, మేయర్ దుర్గా దీప్లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ సుమన్ రావు తదితరులతో కలిసి మంగళవారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. వరద కాల్వలకు డీపీఆర్ ఎలా తయారు చేశారని ఎస్డీపీ వసంతను అడిగి తెలుసుకున్నారు. వరద నీరు పోవడానికి డయా ఎంత ఉంటుందన్నారు.
మంత్రాల చెరువులో ఉన్న నీటిని పూర్తిగా తొలిగించి పూడిక తీయాలన్నారు. అదేవిధంగా చెరువులోకి మురుగు నీరు పోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు కట్టలను విస్తరణ చేయించాలని అధికారులకు తెలియజేశారు. చెరువు తూములను క్లీన్ చేయించాలన్నారు. అవసరం అయితే వరద నీరు పోవడానికి చెరువు కట్ట కింద నుంచి పైపులు వేయాలన్నారు. అనంతరం ప్రశాంత్ నగర్ లో మంత్రి పర్యటిస్తూ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చేయనున్నట్లు కాలనీ వాసులకు తెలిపారు.
కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి మారి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రైరేషన్ను అందజేశారు. కొవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లాక్ డౌన్ సమయంలో ఎవరు బయటకు రావొద్దన్నారు. కొవిడ్ రోగుల కోసం మారి సంస్థ చేస్తున్న సేవలు మరవలేనివి అన్నారు. కొవిడ్ వచ్చిన ప్రతి వ్యక్తికి డ్రైరేషన్ అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏఈ కృష్ణయ్య, టీఆర్ఎస్ అధ్యక్షురాలు సిద్ధాల లావణ్య బీరప్ప, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.