చండీగఢ్: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇంట్లో అనుమానాస్పదంగా మరణించారు. (Family Found Dead) కుటుంబ పెద్ద మృతదేహం సీలింగ్కు వేలాడుతూ కనిపించింది. ఆ వ్యక్తి భార్య, ఇద్దరు కుమార్తెలు, మనవరాలి మృతదేహాలు అదే గదిలో ఉన్నాయి. పంజాబ్లోని జలంధర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అదంపూర్లోని గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తమ ఇంట్లో శవమై కనిపించారు.
ఆదివారం రాత్రి అక్కడకు వెళ్లిన పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. 59 ఏళ్ల మన్మోహన్ సింగ్ మృతదేహం సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించిందని తెలిపారు. ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు, మూడేళ్ల మనవరాలి మృతదేహాలు అదే గదిలోని బెడ్పై ఉన్నాయని చెప్పారు.
కాగా, ఆర్థిక సమస్యల వల్ల ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు మన్మోహన్ సింగ్ రాసిన సూసైడ్ నోట్ ఆ గదిలో లభించిందని పోలీసులు తెలిపారు. తొలుత తన కుటుంబ సభ్యులను చంపి ఆ తర్వాత ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు పెళ్లైన మన్మోహన్ పెద్ద కుమార్తె తన కుమార్తెతో కలిసి తరచుగా పుట్టింటికి వస్తుందని పోలీస్ అధికారి తెలిపారు. ఆమె భర్త ఆదివారం ఫోన్ చేయగా ఎవరూ స్పందించకపోవడంతో అతడితో కలిసి ఆ ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. పెళ్లైన కుమారుడు తన కుటుంబంతో కలిసి విదేశాల్లో ఉంటున్నాడని వివరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.