Blast | హోలీ పండుగ (Holy Festival)ను పురస్కరించుకొని బాణాసంచా తయారు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు (Blast) చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశా (Odisha) ఖుర్దా జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. భువనేశ్వర్కు సమీపంలోని తంగి ప్రాంతంలోని భూసంగాపూర్ గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఓ ఇంట్లో బాణాసంచా తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు పేలుడు జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో పటాకులు అక్రమంగా తయారు చేస్తున్న ఇల్లు పూర్తిగా ధ్వంసమైందన్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారని చెప్పారు. మొత్తం ఘటనలో ఐదుగురు మృతి చెందారని, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వారి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఖుర్దా కలెక్టర్ సుదర్శన్ చక్రబర్తి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఒకరి మృతదేహాన్ని మాత్రమే గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇంట్లో పటాకుల తయారీకి అధికారుల నుంచి నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని పేర్కొన్నారు.