Rohit Shetty : బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత రోహిత్ శెట్టి ఇంటిపై జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ముంబైలోని జూహూలో ఉన్న రోహిత్ శెట్టి ఇంటిపై శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఇంటి బయట కాల్పులు జరిపి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. దీనిపై ఫిర్యాదు అందడంతో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు.
ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురిని పూనేలో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అమన్ ఆనంద్ మారోట్ (27), ఆదిత్య జ్ఞానేశ్వర్ గయాకి (19), సిద్ధార్థ్ దీపక్ యెన్పూరె (20), సమర్థ్ శివ్ శరణ్ పోమాజీ (18), స్వప్నిల్ బందు సాకత్ (23) అనే నిందితుల్ని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు సమాచారం. రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు జరిపింది తామే అని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్తో సంబంధం ఉన్న అన్మోల్ గ్యాంగ్ ప్రకటించుకుంది. దీనికి సంబంధించి ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. గ్యాంగ్స్టర్స్ శుభం లోంకర్, అర్జు బిష్ణోయ్, హరి బాక్సర్, హర్మాన్ సంధులు తామే ఈ కాల్పులకు బాధ్యులం అని ప్రకటించుకున్నారు. ఇది శాంపిల్ మాత్రమే అని, తాము చెప్పినట్లు వినకుంటే మళ్లీ కాల్పులకు పాల్పడతామని ఆ పోస్టులో హెచ్చరించారు. అయితే, ఇదంతా పబ్లిసిటీ స్టంటే అని పోలీసులు కొట్టిపారేశారు. అసలైన నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు తన ఇంటిపై కాల్పుల ఘటనపై రోహిత్ శెట్టి స్పందించారు. తన ఇంటికి ఎవరూ పరామర్శ కోసం రాకూడదని కోరారు. అలాగే పోలీసులకు విచారణ కోసం సహకరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. తన తదుపరి సినిమా షూటింగ్ కూడా కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉంది. ఇక.. కాల్పుల ఘటన నేపథ్యంలో పోలీసులు రోహిత్ ఇంటి వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.