లక్నో : 16 ఏండ్ల బాలిక హత్యాచారం కేసులో ఓ ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థినిపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన యూపీలోని ఫిలిబిత్లో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిలిబిత్కు చెందిన బాలిక శనివారం ఉదయం తన సైకిల్పై కోచింగ్ సెంటర్కు వెళ్లింది. అయితే ఆ రోజు రాత్రి వరకు బాలిక ఇంటికి తిరిగి రాలేదు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలిక వెళ్లిన కోచింగ్ సెంటర్ను పోలీసులు, కుటుంబ సభ్యులు సంప్రదించగా శనివారం క్లాస్కు రాలేదని తేలింది. ఆదివారం ఉదయం గ్రామానికి 500 మీటర్ల దూరంలో ఉన్న ఓ వ్యవసాయ పొలంలో బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం వద్ద బాలిక సైకిల్, స్కూల్ బ్యాగ్తో పాటు మద్యం సీసాలు, తిండి పదార్థాలు లభ్యమైనట్లు పోలీసులు నిర్ధారించారు.
బాలికపై అత్యాచారం చేసి చంపేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆమె ప్రయివేటు భాగాల్లో తీవ్రమైన గాయాలైనట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆమె గొంతుకు చున్ని బిగించి హత్య చేసినట్లు నిర్ధారించారు. నోట్లో కూడా ఓ గుడ్డ ముక్క ఉన్నట్లు తేలింది. శనివారం ఉదయం బాలికను ఫాలో అయిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆమెను కోచింగ్ సెంటర్కు వెళ్లకుండా అడ్డుకుని, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్యాచారం చేసినట్లు తేలింది. ఈ కేసులో ఐదుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.