Fishing boat : పోరుబందర్కు 50 కిలోమీటర్ల దూరంలో నడి సముద్రంలో ఫిషింగ్ బోట్ ‘ప్రేమ్సాగర్’ మునిగిపోతున్నట్టు సమాచారం అందుకున్న భారత తీర రక్షక దళం (Indian Coast Guard-ICG) తక్షణమే స్పందించింది. ICG షిప్ C-16 లో తీర రక్షక దళ సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే సగానికిపైగా మునిగిన మత్స్యకారుల పడవలోకి మరిన్ని నీళ్లు రాకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేసి.. అందులో చిక్కుకున్న ఐదుగురు మత్స్యకారులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.
అనంతరం బాధిత మత్స్యకారులను తమ పడవలోకి ఎక్కించుకుని, మునిగిపోతున్న మత్స్యకారుల బోట్ను తమ బోట్కు కట్టుకుని కోస్ట్ గార్డ్ సిబ్బంది తీరానికి లాక్కొచ్చారు. మత్స్యకారులను రెస్క్యూ చేసేటప్పటికే వారి పడవ దాదాపు 75 శాతం ముగినిపోయిందని, ఆ తర్వాత తీరానికి లాక్కొస్తుండగా పోరుబందర్కు 12 కిలోమీటర్ల దూరంలో మొత్తం మునిగిపోయిందని కోస్ట గార్డ్ సిబ్బంది తెలిపారు.
రెస్క్యూ చేసి తీసుకొచ్చిన మత్స్యకారులను పోరుబందర్లో మత్స్యకార సంఘానికి అప్పగించినట్లు తెలిపారు. ఇండియన్ కోస్ట గార్డ్ సిబ్బంది వారం రోజుల క్రితం కూడా అంటే మార్చి 20న మునుగుతున్న పడవ నుంచి 8 మంది మత్స్యకారులను రెస్క్యూ చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని కుందపుర తీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.