Uttarakhand Tunnel Collapse | న్యూఢిల్లీ, నవంబర్ 21: ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావాలని దేశం యావత్తు కోరుకుంటున్నది. టన్నెల్లో ప్రమాదవశాత్తు కార్మికులంతా చిక్కుకొని.. ఇప్పటికే 10 రోజులైంది. వారిని కాపాడేందుకు సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలో గుర్తుండిపోయే రెస్క్యూ ఆపరేషన్లు వివరాలు పరిశీలిద్దాం..
2018-థాయ్ కేవ్ రెస్క్యూ
13 మంది థాయ్ యూత్ సాకర్ టీమ్ (ఫుట్బాల్) క్రీడాకారులను రక్షించడానికి థాయిలాండ్లో చేపట్టిన ‘థాయ్ కేవ్ రెస్క్యూ’ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భారీ వర్షాల కారణంగా.. వరదలు ముంచెత్తటంతో 2018 జూన్ 23న థామ్ లాంగ్ అనే గుహలో యువ క్రీడాకారులు చిక్కుకుపోయారు. 15 రోజులపాటు అత్యంత దయనీయ పరిస్థితులు ఎదుర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో 10 వేల మందికిపైగా పాల్గొనటం గమనార్హం. వివిధ దేశాలకు చెందిన 90 మంది గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. జూలై 10న అందరూ సురక్షితంగా బయటపడటంతో కథ సుఖాంతమైంది. రెస్క్యూ ఆపరేషన్ నేపథ్యంగా ‘ద రెస్క్యూ’, ‘థర్టీన్ లైవ్స్’, ‘అగెయినిస్ట్ ద ఎలిమెంట్స్’ సినిమాలు వచ్చాయి.
ఆపరేషన్ రాణిగంజ్
అది 1989 నవంబర్ 13.. పశ్చిమబెంగాల్లోని రాణిగంజ్.. ఓ గని లోపల 232 మంది కార్మికులు తవ్వకాలు జరుపుతుండగా ఒక్కసారిగా వరదనీరు ముంచెత్తింది. 161 మంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే 65 మంది గనిలో చిక్కుకుపోయారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. చిక్కుకున్న వారిని కాపాడేందుకు కోల్ ఇండియా మైనింగ్ ఇంజినీర్ జశ్వంత్ గిల్ నేతృత్వంలో ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. క్లిష్టపరిస్థితుల మధ్య స్టీల్ క్యాప్సూల్ని లోపలికి పంపి ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు. ఒళ్లు గగుర్పొడిచేలా సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా బాలీవుడ్లో సినిమా కూడా రూపొందింది. అక్షయ్కుమార్ హీరోగా ‘మిషన్ రాణిగంజ్: ద గ్రేట్ భారత్ రెస్క్యూ’ సినిమా ఆకట్టుకుంది.
చిలీలో: 2010లో శాన్జోస్ బంగారు, రాగి గని కూలడంతో 33 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఏకంగా 69 రోజులపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
క్యూక్రీక్ మైనర్స్ రెస్క్యూ (2002): అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని సోమర్సెట్ కౌంటీలో జరిగిన గని ప్రమాదం ఘటన సంచలనం రేపింది. 77 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత 9 మంది గని కార్మికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. బోరుబావిలో పడ్డ 5 ఏండ్ల బాలుడు: హర్యానా కురుక్షేత్ర జిల్లా హల్దేరి గ్రామంలో ఐదేండ్ల బాలుడు ‘ప్రిన్స్’ 60 అడుగుల బోరు బావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. సుమారు 50 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. సమీపంలో మరో బోరుబావిని గుర్తించి, ఐరన్ పైపులతో రెండింటినీ కనెక్ట్ చేసి బాలుడిని రక్షించారు.
సొరంగంలోని కార్మికుల వీడియో విడుదల
ఉత్తర్కాశీ, నవంబర్ 21: ఉత్తరాఖండ్ ఉత్తర్కాశీలోని సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల వీడియోను అధికారులు మంగళవారం విడుదల చేశారు. అందులో వారు అధికారులు పైప్ ద్వారా పంపిన ఆహారం స్వీకరించడం, పరస్పరం మాట్లాడుకోవడం కనిపించింది. కొత్తగా నిర్మించిన ఆరు అంగుళాల గొట్టం ద్వారా పంపిన ఎండోస్కోపిక్ కెమెరా ద్వారా కార్మికులను వీడియో తీశారు.
బంధువులు, అధికారులు వారితో వాకీటాకీల ద్వారా మాట్లాడారు. కార్మికులను రక్షించేందుకు బల్కోట్ వైపు నుంచి డ్రిల్లింగ్ చేయడం, సమాంతరంగా సొరంగాలు తవ్వడం ఇతర ప్రత్యామ్నాయాలుగా అధికారులు ఉంచుకున్నారు. మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధ పడుతున్న కొందరు కార్మికులకు మందులు పంపించినట్టు వైద్యుడు తెలిపారు.