బెంగళూరు: తొలిసారి విమానంలో ప్రయాణించిన వ్యక్తి అది గాల్లో ఉండగా బీడీ స్మోక్ (smoking beedi) చేశాడు. విమాన సిబ్బందికి ఈ విషయం తెలియడంతో అతడు అరెస్ట్ అయ్యాడు. రాజస్థాన్లోని మార్వార్ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల ప్రవీణ్కుమార్ తన జీవితంలో తొలిసారి విమానం ఎక్కాడు. ఆకాశ ఎయిర్కు చెందిన విమానంలో అహ్మదాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణించాడు. అయితే విమానం గాల్లో ఉండగా సిబ్బంది వినియోగించే టాయిలెట్లో బీడీ కాల్చాడు. విమాన సిబ్బంది ఈ విషయం తెలుసుకుని అతడ్ని నిలదీశారు. ఆ విమానం బెంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాగానే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమానంలో బీడీ స్మోక్ చేసి మిగతా ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలకు ముప్పు కలిగించేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
కాగా, తన జీవితంలో తొలిసారి విమానంలో ప్రయాణించినట్లు నిందితుడు ప్రవీణ్ కుమార్ పోలీసులకు తెలిపాడు. సాధారణంగా రైళ్లలో ప్రయాణిస్తుంటానని, టాయిలెట్లో బీడీలు కాల్చుతానని చెప్పాడు. ఆ అలవాటు వల్ల విమానం టాయిలెట్లో బీడీ స్మోక్ చేసినట్లు వెల్లడించాడు. తొలిసారి విమానంలో ప్రయాణించడం వల్ల సంబంధిత నిబంధనలు తనకు తెలియవని, అందుకే ఈ పొరపాటు చేసినట్లు చెప్పాడు.